న్యూఢిల్లీ : పర్యావరణ మార్పులతో ప్రపంచం కుప్పకూలుతున్నదని రానున్న సంక్షోభాన్ని తప్పించేందుకు మార్పులకు సిద్ధం కావాలని వాతావరణ మార్పులను నిరాకరించేవారికి, రాజకీయ నేతలకు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొన్నేండ్లుగా అధిక ఉష్ణోగ్రతలు, కరువు వంటి అసాధారణ వాతావరణ పరిస్ధితులు ఏ ఒక్కరూ నిరాకరించలేని వాస్తవమని అన్నారు.
కొన్ని దేశాల, వ్యాపారుల, రాజకీయ శక్తుల స్వల్పకాలిక ప్రయోజనాలను విరమించుకుని ఉన్నత రాజకీయ విలువలతో సరైన సమయంలో స్ఫూర్తిని ప్రదర్శించాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. దుబాయ్లో వచ్చే నెలలో కాప్28 సదస్సు జరగనున్న నేపధ్యంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుద్ధ, పునరుత్పాదక ఇంధనాలకు మళ్లడం మందకొడిగా సాగుతూ ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం కొనసాగుతుండటం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం నివసిస్తున్న ప్రపంచం కుప్పకూలుతోంది, మనం బ్రేకింగ్ పాయింట్ దగ్గర ఉన్నామని వ్యాఖ్యానించారు.
వాతావరణ మార్పుల ప్రభావం పలువురు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను దెబ్బతీస్తుందనేది నిస్సందేహమని ప్రైజ్ గాడ్ అనే తన తాజా డాక్యుమెంట్లో పోప్ పేర్కొన్నారు. 2015లో పర్యావరణంపై తన ఎన్సైక్లికల్కు కొనసాగింపుగా పోప్ 7000 వర్డ్ డాక్యుమెంట్లో ఈ విషయాలు ప్రస్తావించారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న అత్యంత అసాధారణ మార్పులను భూమండలం యొక్క నిరసన ఆక్రందనలుగా పోప్ అభివర్ణించారు. ఈ సమస్యను తిరస్కరించడానికి, తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా, వాతావరణ మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పోప్ నొక్కిచెప్పారు.
Read More :