Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..? లేక చనిపోయాడా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై విష ప్రయోగం జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ కరాచీలోని ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దావూద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో భద్రత కట్టుదిట్టం చేశారని తెలుస్తోంది. ఇబ్రహీం ఉంటున్న ఫ్లోర్లోకి కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది డాక్టర్లకు అనుమతి ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే దావూద్పై ఇలాంటి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో పలు సందర్భాల్లో ఆయన చనిపోయినట్లు వార్తలు షికారు చేశాయి. కానీ ఇబ్రహీం అనుచరులు ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇప్పుడు కూడా అలాంటి కథనాలే ప్రసారం కావడంతో.. దావూద్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ సరైన అంచనా వేయలేకపోతున్నారు.
దావూద్ ఇబ్రహీం.. కొవిడ్ బారిన పడ్డాడని, గుండెపోటుతో చనిపోయాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అతని అనుచరులు ఖండించారు. తమ బాస్ బతికే ఉన్నాడని పేర్కొన్నారు. 2020లో దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన భార్య కరోనా బారిన పడ్డారని మీడియా తెలిపింది. దావూద్ను కరోనా బలి తీసుకుందని పేర్కొన్నారు. కానీ అవన్నీ అబద్దాలు అని తర్వాత తేలింది. కరోనా ఆయన మేనల్లుడు సిరాజ్ కస్కర్ ప్రాణాలను బలిగొన్నది.
2017లో ఇబ్రహీం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. మెదడు కణితి కారణంగా మరణించాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వచ్చినప్పటికీ, అవి కూడా అవాస్తవమని తేలింది. అండర్ వరల్డ్ డాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు దావూద్ రైట్ హ్యాండ్ చోటా షకీల్ స్పష్టం చేశారు.
2016లో దావూద్ ఇబ్రహీం కాళ్లకు గ్యాంగ్రీన్ వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. దావూద్ కాళ్లను కత్తిరించాలని పుకార్లు వచ్చాయి. ఈ వార్తలు కూడా అవాస్తవమని తేలింది.
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్స్టర్ ఇబ్రహీం జీవితం చాలా సంవత్సరాలుగా రహస్యంగా ఉంది. దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో తల దాచుకున్నట్లు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని భారత్ పేర్కొన్నప్పటికీ పాక్ మాత్రం తిప్పికొట్టింది. తాజాగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలియడంతో.. ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దావూద్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు అలిసాహ్ పర్కర్, సాజిద్ వాగ్లేను పోలీసులు సంప్రదించారు.