టోక్యో : భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాములని పేర్కొన్నారు. టోక్యోలో సోమవారం భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
తాను ఎప్పుడు జపాన్ వచ్చినా ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమతో తనను స్వాగతిస్తారని చెప్పారు. భారత్-జపాన్ బంధాన్ని ఇక్కడ నివసిస్తున్న భారత సంతతికి చెందిన మీరు బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. మీలో చాలా మంది ఎన్నో ఏండ్ల నుంచి జపాన్లో నివసిస్తూ ఈ దేశ సంస్కృతిని అలవరుచుకున్నారని అన్నారు. ఇప్పటికి మీలో భారత సంస్కృతి, భాష పట్ల మీ అంకితభావం పెరుగుతున్నదని కితాబిచ్చారు.
బుద్ధుడు చూపిన మార్గంలో ప్రపంచం నడవాల్సిన పరిస్ధితి నెలకొందని అన్నారు. హింస, వాతావరణ మార్పుల వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు బుద్ధిజమే సరైన మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తున్నామని భారత్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్ధగా మలిచామని అన్నారు. ఇక అంతకుముందు ప్రధాని టోక్యోలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.