Petrol Rate | Petrol Rate | రష్యా నుంచి చౌక ధరలకు చమురు ఉత్పత్తులు పాకిస్తాన్కు చేరుకుంటాయని ఆ దేశ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఇస్లామాబాద్లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం పేదలకు, ధనికులకు వేర్వేరు ధరలకు విక్రయించనున్నట్లు మాలిక్ చెప్పారు. దేశం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని, కాబట్టి తక్కువ ధరలకు చమురును దిగుమతి ఎలా చేసుకోవచ్చో దారులు వెతుకుతున్నామని, ఈ దిశగా కసరత్తు చేశామన్నారు.
పేదలకు, ధనికులకు వేర్వేరుగా ధరలు అమలు చేయనున్నట్లు పేర్కొన్న ఆయన.. టారిఫ్ ప్రకటన తర్వాత సమాజంలోని పేదలకు ఊరట లభిస్తుందన్నారు. పాక్ పెట్రోలియం విభాగం రష్యా నుంచి ముడి చమురును బ్యారెల్కు 50 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నది. అమెరికా కంటే పది డాలర్లు తక్కువ. అయితే, సముద్ర మార్గంలో చమురు పాక్కు చేరుకునేందుకు దాదాపు నెల రోజులు సమయం పడుతుంది.
ఒప్పందంపై సంతకాలు చేసే ముందు చెల్లింపు విధానం, షిప్పింగ్ ఖర్చులు, బీమా తదితర షరతులకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రష్యాతో చమురు ఒప్పందం నేపథ్యంలో పాక్లో రాజకీయంగా వివాదాస్పద అంశం కాగా.. అగ్రరాజ్యం పాక్పై ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో అప్పటి ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మాస్కోలో పర్యటించిన సమయంలో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ పర్యటనలో ఇషాక్ దార్ చమురును, గ్యాస్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పెట్రోలియం మంత్రి మాలిక్ సైతం మరోసారి రష్యాను సందర్శించారు. జనవరిలో ఒప్పందం ఖరారు చేసుకునేందుకు రష్యా బృందం ఇస్లామాబాద్కు వచ్చింది. మరో వైపు ప్రస్తుతం పాక్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర పాక్లో రూ.270పైగా ఉన్నది.