తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ నుంచి భార్య, బిడ్డలతో ఎలాగైనా బయటపడాలని గత కొద్ది రోజులుగా కొన్ని వందల కుటుంబాలు కాబూల్ విమానాశ్రయం ముందు పడిగాపులు కాస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ గోడ పక్కనున్న మురుగు కాల్వలోకి దిగిన కొందరు.. విమానాశ్రయంలోనికి అనుమతించాలని అమెరికా దళాల్ని వేడుకుంటున్న వీడియోలు ప్రతిఒక్కరినీ కదిలిస్తున్నాయి.
కాబూల్, ఆగస్టు 25: పంజ్షీర్ను ఆక్రమించుకోవాలనుకుంటున్న తాలిబన్లతో యుద్ధం చేయడానికి సిద్ధమేనని పంజ్షీర్ రక్షణ దళం (ఉత్తర కూటమి) కమాండర్ అమీర్ అక్మల్ స్పష్టం చేశారు. యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు, ఇతర వనరులన్నీ ఉన్నాయన్నారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరుపడానికైనా లేదా యుద్ధం చేయడానికైనా తాము సిద్ధమేనన్నారు. పంజ్షీర్ను ఆక్రమించుకోవాలని తమకు ఆదేశాలు వస్తే తప్పకుండా ఆ పని చేస్తామని తాలిబన్ కమాండర్ ముల్లాహ్ ఖక్సర్ తెలిపారు. ప్రపంచ దేశాలతో సంబంధాలు లేకుండా అఫ్గాన్ సరిహద్దులను మూసేసిన తాలిబన్లపై బ్రిటన్ ధ్వజమెత్తింది. క్షిపణులు, రాకెట్ల వంటి అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలాఉండగా.. అఫ్గానిస్థాన్కు ఆర్థిక సహకారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది.
తాలిబన్ సహాయ కేంద్రంగా పాకిస్థాన్
తమకు సహాయ, సహకారాలు అందించే కేంద్రంగా తాలిబన్లు పాకిస్థాన్ను వినియోగించుకుంటున్నారని, తాలిబన్ ఫైటర్ల సేవలో పాక్ ప్రభుత్వం ఉన్నదని అఫ్గానిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ ఆరోపించారు. ఉగ్రవాదం నిర్మూలన కోసం అమెరికా ఇచ్చిన డబ్బుతో తాలిబన్లకు అవసరమైన సదుపాయాలను పాక్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో సేనల్ని ఉపసంహరించి అఫ్గాన్లో కల్లోలాన్ని సృష్టించిన అమెరికా మూల్యం చెల్లించుకుంటుందన్నారు. పంజ్షీర్ తమ ఆధీనంలోనే ఉన్నదన్నారు. ఇదిలా ఉండగా, తాలిబన్లు ఇండ్లలోకి చొరబడి 15 ఏండ్లు దాటిన బాలికలు, మహిళల కోసం వెదుకుతున్నారని అమెరికాకు చెందిన డల్లాస్ మార్నింగ్ న్యూస్ పత్రిక మహిళా జర్నలిస్ట్ హోలీ మెక్కే మండిపడ్డారు. స్నేహితురాళ్ల సాయంతో తాను అఫ్గాన్ నుంచి బయటపడ్డట్టు వెల్లడించారు.
ఈ-వీసాలతోనే రాక
అఫ్గాన్ పౌరులు ఇకపై కేవలం ఈ-వీసాల ద్వారానే భారత్కు రావాలని కేంద్రహోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్ వెలుపల ఉన్న అఫ్గాన్ దేశస్థులకు ఇదివరకే జారీచేసిన వీసాలన్నీ రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
నాడు ఐటీ మంత్రి.. నేడు పిజ్జా డెలివరీ బాయ్
అఫ్గానిస్థాన్ ఐటీ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో సాదత్ 2018 నుంచి 2020 వరకు ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అష్రఫ్తో విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేసి డిసెంబర్ లో జర్మనీ వెళ్లారు.అక్కడ పొట్టకూటి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నట్టు సాదత్ చెప్పారు.