అమెరికా ఇటీవల నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు(Summit for Democracy)కు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. డిసెంబర్ 9-10 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి సి నుంచి నిర్వహించిన ఈ డిజిటల్ సదస్సుకు పాకిస్తాన్తో సహా 110 దేశాలకు ఆహ్వానం అందింది. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో జరిగిన ప్రజాస్వామ్య సదస్సుకు చైనా, బంగ్లాదేశ్కు పిలుపు రాలేదు.
గత కొంత కాలంగా చైనాతో అమెరికా సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో.. డ్రాగన్ దేశాన్ని పిలవకుండా, దాని శత్రు దేశమైన తైవాన్ని ఈ సదస్సులో పిలవడంతో చైనా ప్రభుత్వం అగ్గిగుగ్గిలమైంది. తనను అంతర్జాతీయంగా ఏకాకిగా చేసి దెబ్బ కొట్టేందుకు అమెరికా ఇలా చేస్తోందని చైనా అధికారులు చెబుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్థిక, మిలిటరీ పరంగా చైనా నుంచి సహాయం పొందుతోంది. దీంతో చైనా తన మిత్ర దేశమైన పాకిస్తాన్ను కూడా ఈ సదస్సును బహిష్కరించాల్సిందిగా కోరింది. ఈ కారణంగానే డ్రాగన్ దేశ కోరిక కాదనలేక పాకిస్తాన్ ఈ సదస్సుకు గైర్హాజరైందని సమాచారం.
అయితే పాకిస్తాన్ చర్యకు మరో కారణం కూడా ఉంది. అమెరికా అధ్యక్ష పీఠమెక్కినప్పటి నుంచి బైడెన్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు ఒక్కసారి పలకరించలేదని.. పాకిస్తాన్ అలకకు అది కూడా ఒక కారణం కావొచ్చునని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.