Imran Khan | పాకిస్థాన్ మిలిటరీ (Pakistan military) తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్ చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో (Jail)ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అయితే పాక్ సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి లాహోర్లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలతో సమావేశమయ్యారు.
అనంతరం వరుస ట్విట్ల ద్వారా పాక్ ఆర్మీపై ఆరోపణలు గుప్పించారు. లండన్ (London) ప్రణాళిక ఇప్పుడు పూర్తయింది. తాను జైలులో ఉన్నప్పుడు హింసను (Violence) సాకుగా చూపి న్యాయమూర్తి పాత్రను పోషించారు. తన భార్య బుష్రా బేగంను (Bushra begum) జైలులో పెట్టడం ద్వారా అవమానించాలనుకున్నారు. దేశ ద్రోహ చట్టాన్ని ఉపయోగింది వచ్చే పదేండ్లూ తనను జైలులోనే ఉంచాలనుకున్నారంటూ ట్వీట్ చేశారు. తనను అరెస్టు చేయడం ద్వారా పీటీఐ కార్యకర్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేయాలనుకున్నారని చెప్పారు. అదేవిధంగా మీడియా పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూశారని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ప్రధానంగా రెండు కేసులు ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ రెండు కేసుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ అక్రమంగా డబ్బు కూడగట్టారనేది ప్రధాన ఆరోపణ. ఆ రెండు కేసుల్లో ఒకటి అల్ ఖదిర్ ట్రస్టు కేసు కాగా మరోకటి తోషఖానా కేసు.
ఈ కేసుకు సంబంధించి దేశ ఖాజానాకు రూ.5వేల కోట్లు నష్టం వాటిల్లందనే ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అల్ ఖదీర్ ట్రస్ట్ ఏర్పాటు ముసుగులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే అరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వ ఆరోపణల ప్రకారం.. పాకిస్థాన్ పంజాబ్లోని జీలం జిల్లాలో సూఫీయిజం బోధించేందుకు అల్ ఖదీర్ యూనివర్సిటీ నిర్మించేందుకు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, కొద్ది మంది సన్నిహితులతో అల్ ఖదీర్ ట్రస్టు ఏర్పాటు చేశారు.
2019లో ఇమ్రాన్ ఖాన్ భార్య బహ్రియా పట్టణానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ట్రస్ట్కు దాదాపు 57 ఎకరాల భూమిని ఆ సంస్థ విరాళంగా ఇచ్చింది. ఆ భూమిలో 30 ఎకరాల భూమిని బుష్రా బీబీ తన ఫ్రెండ్ పేరు మీద బదలాయించింది.
బహ్రియా పట్టణంలో రియల్ ఎస్టేట్ అధిపతి అయిన మాలిక్ రియాజ్ నుంచి బ్రిటన్లో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఏకంగా 19కోట్ల పౌండ్ల (పాకిస్థాన్ కరెన్సీలో రూ.5000కోట్లు) బ్లాక్మనీని జప్తు చేసింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఇతర దేశాలకు చెందిన వ్యక్తి డబ్బుల్ని స్వాధీనం చేసినట్లైతే ఆ డబ్బును తిరిగి వ్యక్తి సొంత దేశ ప్రభుత్వానికి అప్పగించాలి. అలా బ్రిటన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఆ డబ్బును అప్పగించింది.
మాలిక్ రియాజ్ ఇమ్రాన్ ఖాన్తో ఒప్పందం కుదుర్చుకోవడంతోనే ఆ డబ్బును అతడి బ్రిటన్ అకౌంట్కు అప్పటి ప్రభుత్వం పంపించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. ఇందుకోసం అల్ ఖదీర్ ట్రస్టుకు భూమితో పాటు రూ.500కోట్ల డబ్బును మాలిక్ రియాజ్ ఇచ్చినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ను మే 9న అరెస్టు చేశారు.
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందే కానుకలను ఇక్కడ భద్రపరచాలన్నమాట. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా అతడికి దాదాపు 100 కానుకలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన కానుకలేంటో చెప్పేందుకు నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకునేందుకు ఈసీకి లేఖ కూడా రాశారు.
ప్రభుత్వానికి రూ.2కోట్లు చెల్లించి రూ.10 కోట్ల విలువైన కానుకల్ని తీసుకున్నారని, అంతేకాకుండా మార్కెట్లో వాటిని అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ తోషాఖానా వివాదంపై 2022 ఆగష్టులో సంకీర్ణ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆశ్చర్యకర విషయం ఏటంటే ఇమ్రాన్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత తోషాఖానాలో పుస్తకాలు తప్ప ఏం మిగలలేదు. పాక్ కోర్టు సైతం ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేల్చింది.
So now the complete London plan is out. Using pretext of violence while I was inside the jail, they have assumed the role of judge, jury and executioner. The Plan now is to humiliate me by putting Bushra begum in jail, and using some sedition law to keep me inside for next ten…
— Imran Khan (@ImranKhanPTI) May 14, 2023