ఇస్లామాబాద్: ఇటీవల పాక్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన టెర్రరిస్టుల హత్యలకు భారతే కారణమంటూ పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందిన ఇద్దరు పాక్ టెర్రరిస్టుల హత్యలతో భారత్కు చెందిన ఏజెంట్ల పాత్ర ఉందని నిరూపించే విశ్వసనీయమైన సాక్ష్యం తమ వద్ద ఉందని గురువారం ఆరోపించింది.
భారత్ తమ భూభాగంలో కుట్రలతో ఈ హత్యలకు పాల్పడిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ సైరస్ సజ్జద్ ఖాజీ ఆరోపించారు. భారత ఏజెంట్లు ఈ విషయంలో సాంకేతికతను, సురక్షిత మార్గాలను వినియోగించారని ఆయన అన్నారు. వారు కొందరు ఉగ్రవాదులు, నేరస్థులు, ఏమాత్రం అనుమానం కలగని పౌరులను ఈ పనికి నియమించి ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు టెర్రరిస్టుల హత్యలపై పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.