వాషింగ్టన్ : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ జజ్వా అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా-పాకిస్తాన్ల మధ్య సంబంధాలను పునరుద్ధరించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. జనరల్ బజ్వా పర్యటన గురించి పాక్ విదేశాంగశాఖకు గానీ, పాక్ ఆర్మీకి గానీ ఎలాంటి సమాచారం లేనట్లుగా తెలుస్తున్నది. జనరల్ బజ్వా అమెరికాకు వచ్చిన విషయాన్ని అమెరికాలోని పాక్ రాయబారి సర్దార్ మసూద్ ఖాన్ ధ్రువీకరించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా 2019 తర్వాత తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. పాకిస్తాన్లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం, అంతకుముందు వరదలు ఆ దేశ పరిస్థితులను దిగజార్చాయి. ఫలితంగా పాకిస్థాన్ ఆర్థికంగా దివాలా అంచుకు చేరుకున్నది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికాతో సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించేందుకు జనరల్ బజ్వా నెత్తికెత్తుకున్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే అమెరికాకు వెళ్లారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. జనరల్ బజ్వా అమెరికా పర్యటనకు సంబంధించిన సమాచారం పాకిస్తాన్ సైన్యం లేదా విదేశాంగ మంత్రిత్వశాఖ ఇవ్వలేదు. సాధారణంగా ఆర్మీ చీఫ్ వంటి ఉన్నతాధికారుల విదేశీ పర్యటనలకు సంబంధించి ఈ రెండు శాఖలు మీడియాకు బ్రీఫింగ్ ఇస్తాయి. అయితే, ఈసారి అలా జరగకపోవడం విశేషం.
నిజానికి జనరల్ బజ్వా శుక్రవారం నాడే లండన్ నుంచి న్యూయార్క్ చేరుకున్నట్లు సమాచారం. దీనిపై అమెరికాలోని పాక్ రాయబారి సర్దార్ మసూద్ ఖాన్ను ప్రశ్నించగా.. జనరల్ బజ్వా పర్యటనను ఆయన ధృవీకరించారు. ఇంతకంటే సమాచారం ఇవ్వలేనన్న ఆయన.. తన అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలలో కొత్త దశను జనరల్ బజ్వా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హేన్స్, సీఐఏ చీఫ్ విలియం బర్న్స్తో జనరల్ బజ్వా చర్చలు జరుపుతారని విశ్వసనీయ సమాచారం. ఇలాఉండగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గత వారం అమెరికాలో పర్యటించారు.