Food crisis : దాయాది పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో టాప్-10లో పాకిస్థాన్ కూడా ఉందని ఐక్యరాజ్యసమితి (UNO) మద్దతుతో విడుదలైన ఓ నివేదిక స్పష్టంచేసింది. ‘2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ పేరుతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లో సుమారు 1.1 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్నారు. పాకిస్థాన్లో ఈ దుస్థితికి తీవ్రమైన వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. ముఖ్యంగా 2025లో సంభవించిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలవల్ల 60 లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారని, పంట పొలాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొన్నది.
వాతావరణ పరిస్థితులవల్ల పాకిస్థాన్లో ఆహార భద్రత ప్రమాదంలో పడిందని తెలిపింది. ఆ దేశంలో ఆహార కొరతతో బాధపడుతున్న 1.1 కోట్ల మందిలో.. 93 లక్షల మంది ‘సంక్షోభ’ పరిస్థితుల్లో, 17 లక్షల మంది ‘అత్యవసర’ పరిస్థితుల్లో ఉన్నారని నివేదిక వెల్లడించింది. బలూచిస్థాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలలో పోషకాహార లోపం కూడా తీవ్రంగా ఉన్నట్టు గుర్తించింది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి పోషకాహార లోపంపై కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవని నివేదిక తెలియజేసింది.
కాగా 2026లో పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం 6 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఇది ఆహార వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచుతుందని నివేదిక అంచనా వేసింది. గతంలో 43 జిల్లాల్లో నిర్వహించిన సర్వేను ఈసారి 68 జిల్లాలకు విస్తరించడంతో దేశంలోని ఆహార సంక్షోభం తీవ్రత మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చిందని పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ తన కథనంలో పేర్కొన్నది.