పారాసిటమాల్, ఐబుప్రొఫెన్తో బిడ్డకు ముప్పు
నెలలు నిండక ముందే జననం.. ఆరోగ్య సమస్యలు
33% కేసుల్లో బిడ్డ మరణించవచ్చు: యూకే అధ్యయనం
లండన్, మే 15: గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. పిల్లలు తక్కువ బరువుతో, ఆరోగ్య సమస్యలతో పుట్టవచ్చు. శిశుమరణాలు సంభవించవచ్చు’ అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎబెర్డిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 30 ఏండ్ల పాటు 1.51 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు.
గర్భంతో ఉన్నప్పుడు తలనొప్పి, వికారం, జ్వరం, ఒళ్లు నొప్పులు సహజం. అయితే, ప్రపంచవ్యాప్తంగా 60% మంది గర్భిణులు వైద్యులను సంప్రదించకుండానే పారాసిటమాల్, ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. దీంతో ‘నెలలు నిండకముందే పిల్లలు పుట్టే ప్రమాదం 50 శాతం పెరుగుతుంది. 33% కేసుల్లో బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వివరాలను బీఎంజే ఓపెన్ అనే జర్నల్లో ప్రచురించారు. గర్భిణులు వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దని తెలిపారు.