ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 28: వానకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో రైతులు దుక్కులు దున్ని, విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాట్లు వేసేందుకు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మడుల్లో నారు పోసేందుకు చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల తుకం పోసి నాటేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్లో వరిని సాగుచేస్తున్న రైతులు తమ సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వరిలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే లాభాల పంటేనని చెబుతున్నారు. ఈసారి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కువ శాతం సన్నరకం వరినే సాగుచేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. నారు వేసే రైతులు ముందుగా మేలు రకం విత్తనాలు ఎంచుకోవాలని, లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, అందుకు సంబంధించిన రశీదును భద్రపర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎకరానికి 25 కిలోల విత్తనాలు..
ప్రతి ఎకరానికి 25 కిలోల మేలు రకం విత్తనాలను ఎంచుకోవాలి. కిలో విత్తనాలకు కార్బండిజిమ్ 2.5 గ్రాములు లేదా సూడోమోనస్ పది గ్రాములతో విత్తన శుద్ధిచేపట్టాలి. నారు పోసేందుకు ఎంచుకున్న విత్తనాలను ముందుగా మొలక శాతం ఎంచుకుని, పరీక్షించుకోవాలి. ముందుగా విత్తనాలను నీటితో 24 గంటలు నానబెట్టాలి. తరువాత బస్తాలోకి ఎత్తాలి. కనీసం మూడురోజుల తర్వాత మొలకొచ్చిన విత్తనాల్ని ముందుగా సిద్ధం చేసుకున్న నారుమడిలో చల్లాలి. భూ పరీక్షల్లో తేలిన అవసరం మేరకు జింక్, కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంటుంది.
ఎకరానికి ఐదుసెంట్ల నారు..
నారు పోసుకునే సాగు భూమిని సారవంతంగా చేసుకోవాలి. ఎకరానికి ఐదు సెంట్ల నారు సరిపోతుంది. సార్వా కోతతో నేలలో ఉండిపోయిన దుబ్బులను తొలగించాలి. మడిలో సరిపడా నీరు పెట్టి దమ్ము చేయాలి. నారుమడిలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. 25 నుంచి 30 రోజుల నారును మాత్రమే నాటుకునేందుకు ఎంచుకోవాలి.
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి..
నారులో కలుపు నివారణకు నామినిగోల్డ్ మందును 5 సెంట్లకు పది మిల్లీలీటర్ల చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు చల్లే ముందు యూరియా రెండు కిలోలు వేయాలి. దమ్ములో సింగిల్ సూపర్ ఫాస్పెట్ రూపంలో ఆరు కిలోల భాస్వరం వేయాలి. విత్తనాలు చల్లేముందు 5సెంట్ల నారుమడికి రెండు కిలోల యూరియా వాడాలి. నారుమడి 12 నుంచి 14 రోజుల వయస్సులో మరో రెండు కిలోల యూరియా చల్లాలి.
సరైన జాగ్రత్తలు పాటించాలి
ఈ సీజన్లో వరిని సాగు చేసే రైతులు ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి. నారు వేసే వారు ముందుగా వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మేలురకం విత్తనాలను రైతులు తీసుకోవాలి. ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటిలో విత్తనాలు కొనుగోలు చేయాలి.
– రఘు, ఏఈవో, వ్యవసాయ శాఖ, ఇబ్రహీంపట్నం