న్యూఢిల్లీ: చాలా మంది విద్యార్థులు గణితంలో అంటే కొంచం తడబడుతుంటారు. సైన్స్ అన్నా భయపడుతుంటారు. పాకిస్థాన్లో ప్రైమరీ, లోయర్ సెకండరీ చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతానికిపైగా మంది ఈ రెండు సబ్జెక్టుల్లో చాలా వీక్ అట. వాటిలో ప్రాథమిక అవగాహన కూడా కరువేనని ఓ నివేదిక తేల్చింది.
ఆఘా ఖాన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ దేశంలోని 153 ప్రభుత్వ (78), ప్రైవేటు (75) పాఠశాలల్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ఓ ప్రామాణిక పరీక్ష నిర్వహించింది. ఇందులో ఐదు, ఆరు, ఎనిమిదో తరగతి చదువుతున్న 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
గణితంలో 100కుగాను సగటున 27 మార్కులు, సైన్స్లో 34 మార్కులు సాధించారు. ఒక్క శాతం విద్యార్థులు మాత్రమే 80 మార్కులకుపైగా సాధించారు. అంటే వీళ్లు మాత్రమే ఈ రెండు సబ్జెక్టులను మంచిగా అర్థం చేసుకోగలుగుతున్నారని నివేదిక వెల్లడించింది.
ఇక.. సైన్స్లో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ మార్కులు సాధించగా, మ్యాథ్స్లో మాత్రం ఇద్దరు సమానంగా నిలిచారని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేట్ విద్యార్థులే మెరుగ్గా ఉన్నారని, అయితే రెండు సబ్జెక్టుల్లో వారి మార్కులు 40కి దాటలేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పంజాబ్ ప్రావిన్స్లోని విద్యార్థులు మాత్రమే మంచి ప్రతిభ కనబర్చారని పేర్కొన్నది. కాగా, ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు సెకండరీ స్కూలు సర్టిఫికెట్ కలిగినవారేనని తెలిపింది.