Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 800 దాటింది. ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ భూకంపం కారణంగా 820 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 350 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 51 మంది పరిస్థితి క్రిటికల్గా ఉంది.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మర్రకేష్కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్ హౌజ్, మర్రకేష్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా, భూకంపం ధాటికి ప్రజలు భయంతో వణికిపోయారు. అర్ధరాత్రి కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే మైఖేల్ బైజట్ అనే 43 ఏళ్ల వ్యక్తి కూడా భూకంప సమయంలో తన అనుభవాన్ని వెల్లడించాడు. భూకంపం సంభవించినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, మంచం ఊగిపోతుండటంతో తనకు మెళుకువ వచ్చిందని, కళ్లు తెరచి చూడగానే మంచం గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించిందని మైఖేల్ తెలిపారు. ఆ తర్వాత తేరుకుని భూకంపం చోటుచేసుకుందని గ్రహించానని, భయంతో అర్ధనగ్నంగానే బయటికి పరుగులు తీశానని మైఖేల్ బైజట్ చెప్పాడు.
Also Read..
Morocco Earthquake | మొరాకోకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది : ప్రధాని మోదీ
Akshata Murty | రిషి సునాక్ నెక్ టై సరిచేసిన అక్షతా మూర్తి.. వైరలవుతున్న పిక్
African Union | జీ20లో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం