జెనీవా: ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడి నేపథ్యంలో 60 లక్షల మందికిపైగా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది. ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ నెల 11 వరకు 60,29,705 మంది దేశ సరిహద్దులు దాటివెళ్లారని పేర్కొన్నది. అందులో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని వెల్లడించింది.
అత్యధికులు పోలండ్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పింది. కాగా, 18-90 ఏండ్ల వయస్కులైన పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉన్నందును వారంతా దేశంలోనే ఉండిపోయారని తెలిపింది. మరో 80 లక్షల మంది దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని పేర్కొన్నది. అయితే రోజు సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పింది.
మార్చి నెలలో యుద్ధ భూమి నుంచి 30 లక్షల 40 వేల మంది దేశం విడిచి వెళ్లారని, ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య పది లక్షల 50 వేలకు తగ్గిందని వెల్లడించింది. ఇక మే నెల ప్రారంభం నుంచి 4 లక్షల 93 వేల మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని, మొత్తంగా ఈ ఏడాది 80 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తున్నది.
రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా, స్వతంత్ర భూభాగాలుగా ఉన్న రెండు రీజియిన్లలోని ప్రజలను మినహాయించి.. ఉక్రెయిన్ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలు.