కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్-ఎ-షరీఫ్లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్ ప్రాంతంలోని షియా మసీదులో శక్తివంతమైన బాంబు పేలింది. రంజాన్ మాసం నేపథ్యంలో మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిలో పది మందికిపైగా చనిపోయారని, 40 మందికిపైగా గాయపడ్డారని ఏపీ వార్తా సంస్థ పేర్కొంది. బాంబు పేలుడులో గాయపడిన వారిని కార్లు, అంబులెన్స్లలో ప్రధాన ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరుగవచ్చని చెప్పారు. అయితే బాంబు పేలుడులో కనీసం 18 మరణించి ఉంటారని, 30 మంది గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మరోవైపు మసీదులో జరిగిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మరణించి ఉంటారని ప్రాథమిక రిపోర్టుల ద్వారా తెలుస్తున్నదని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. 20 మందికిపైగా చనిపోయినట్లు స్థానిక తాలిబన్ కమాండర్ మహ్మద్ ఆసిఫ్ వజేరి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదని వెల్లడించింది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ వశమైనప్పటి నుంచి మసీదుల్లో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. మైనార్టీలైన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. షియా మసీదుల్లో ప్రార్థనల సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ వంటి సున్నీ మిలిటెంట్ సంస్థలు తరుచుగా బాంబు దాడులకు పాల్పడుతున్నాయి.
#Breaking : At least 18 people have been killed and 30 injured in a blast occurred at a shia Muslim mosque of Seh Dokan, MazarSharif city Balkh Province Afghanistan. Local Reports#Afghanistan #mazarsharif
pic.twitter.com/2vCnYhIwsg— Syed Shahriyar (@shahriyarsyed1) April 21, 2022