టోక్యో: జపాన్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఒసాకాలో అత్యధిక స్థాయిలో మంగళవారం ఆరు వేల కేసులు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నమోదు అయిన అత్యధిక కేసుల సంఖ్యను ఒసాకా దాటేసింది. ఒసాకాతో పాటు ఒకినావో, హిరోషిమా, క్యోటో ప్రాంతాల్లోనూ శని, ఆదివారాలు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ అక్కడ వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెల తర్వాత మళ్లీ అత్యధికంగా 25వేల కేసులు నమోదు అయ్యాయి. అమెరికా సైనిక కేంద్రాలు ఉండే ఒకినావా ప్రాంతంలో దాదాపు రెండు వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. అమెరికా స్థావరాల వద్ద సరైన నియంత్రణ లేకపోవడం వల్లే వైరస్ సాధారణ ప్రజల్లోకి వ్యాపిస్తున్నట్లు ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న మూడు ప్రాంతాల్లోనూ జపాన్ ప్రభుత్వం కఠిన కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది. వాస్తవానికి విదేశీయులను గత నవంబర్ నుంచి జపాన్ నిషేధించింది. కానీ అమెరికా మిలిటరీ సిబ్బంది మాత్రం ప్రత్యేక క్వారెంటైన్ పద్ధతిలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.