కరోనా కట్టడికి సంజీవనిగా భావిస్తున్న వ్యాక్సిన్లలో ఒకటైన ‘ఆస్ట్రాజెనెకా’ టీకాపై నిషేధపర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలుదేశాలు ఈ టీకాను నిషేధించగా.. తాజాగా, స్వీడన్ కూడా అదే నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించింది. 50కి పైగా దేశాల్లో అనుమతి పొందిన ఏకైక వ్యాక్సిన్గా నిలిచిన ఈ టీకాపై నిషేధం విధించడానికి కారణాలేమిటి?
కరోనా నియంత్రణకు ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి స్వీడన్కు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా ‘ఏజెడ్డీ1222’ పేరిట ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో పోలిస్తే.. అనుకూలమైన నిల్వ ఉష్ణోగ్రతలు, తక్కువ ధర ఉండటం వల్ల 50కి పైగా దేశాలు ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించాయి. ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న పది రోజుల తర్వాత డెన్మార్క్లో ఒక వ్యక్తి రక్తనాళాల్లో నెత్తురు గడ్డకట్టి మరణించాడు. ఆ దేశంలో టీకా తీసుకున్న పలువురిలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. దీంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు గతవారం డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్ తీసుకున్న పలువురి మెదడు తదితర భాగాల్లో రక్తం గడ్డకట్టడం, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం లాంటి ఫిర్యాదులు పలు దేశాల్లో వచ్చాయి. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్పై ఆయా దేశాలు నిషేధం విధించాయి. వీటిలో డెన్మార్క్, ఐర్లాండ్, కాంగో, బల్గేరియా, నార్వే, నెదర్లాండ్స్, ఇండోనేషియా, ఈస్తోనియా, లాత్వియా, లిథువేనియా, డెన్మార్క్, ఆస్ట్రియా, లక్సంబర్గ్, స్లొవేనియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. తాజాగా మంగళవారం స్వీడన్ కూడా ఈ వ్యాక్సిన్పై తాత్కాలిక నిషేధం విధించింది.
తమ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే రక్త నాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న వాదనల్లో ఎలాంటి నిజంలేదని ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘బ్రిటన్ తదితర ఐరోపా దేశాల్లో మా వ్యాక్సిన్ను ఇప్పటివరకూ 1.7 కోట్ల మందికి ఇచ్చాం. ఇందులో వంద మందిలో కూడా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తలేదు’ అని ఆస్ట్రాజెనెకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆన్ టేలర్ తెలిపారు. అయితే, తమ వ్యాక్సిన్ వల్లే రక్తం గడ్డకట్టినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను వేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని యురోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైనదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. మరోవైపు, ఆస్ట్రాజెనెకా టీకాపై గత శుక్రవారం నిషేధం విధించిన థాయ్లాండ్ సోమవారం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. మంగళవారం ఆ దేశ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా ఆస్ట్రాజెనెకా టీకాను వేసుకున్నారు. టీకాపై అపోహ లు వద్దన్నారు.
ఆస్ట్రాజెనెకా టీకాను ‘కొవిషీల్డ్’ పేరుతో పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారత్లో ఉత్పత్తి చేస్తున్నది. అయితే ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ‘కొవిషీల్డ్’పై లోతైన సమీక్షను నిర్వహిస్తున్నట్టు ఎస్ఐఐ ప్రతినిధులు తెలిపారు. ‘ఆస్ట్రాజెనెకా టీకా వల్ల సమస్యలు తలెత్తుతున్నట్టు వస్తున్న వార్తలను గమనించాం. దేశంలో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా? లేదా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైతే తగిన చర్యలు తీసుకుంటాం’ అని కొవిడ్-19 జాతీయ కార్యచరణ దళం సభ్యుడు ఎన్కే అరోరా తెలిపారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొవిషీల్డ్తో పాటు, హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ను ఇస్తున్నారు. మంగళవారంనాటికి దేశవ్యాప్తంగా 3.2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇందులో ఎక్కువ డోసులు ‘కొవిషీల్డ్’వే. ఈ వ్యాక్సిన్ లక్షలాది డోసులను 70కి పైగా దేశాలకు సీరమ్ ఎగుమతి చేసింది. కాగా మంగళవారం మరో 10 కోట్ల ‘కొవిషీల్డ్’ డోసుల కొనుగోలుకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.