లండన్, నవంబర్ 4: కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో తన అధ్యయనం ద్వారా కీలక విషయాన్ని వెల్లడించింది. 2050 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోని పలు మంచు కొండలు(హిమనీనదాలు-గ్లేసియర్స్) ముప్పును ఎదుర్కొంటున్నాయని, మూడో వంతు కరిగి మాయమైపోతాయని పేర్కొన్నది. 50 ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లోని 18,600 హిమనీనదాల ప్రస్తుత పరిస్థితిపై యునెస్కో అధ్యయనం చేసింది. 2050 నాటికి కరిగిపోనున్న మంచుకొండల జాబితాలో ఇటలీలోని డోలమైట్స్, అమెరికాలోని యోసెమైల్, యెల్లోస్టోన్, టాంజానియాలోని కిలిమంజారో ఉన్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా కొనసాగిస్తే మిగతా మూడింట రెండో వంతు గ్లేసియర్స్ను కాపాడుకోవచ్చని యునెస్కో అభిప్రాయపడింది. తాజా నివేదిక వాతావరణ మార్పుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నదని, కార్బన్డయాక్సైడ్ విడుదల స్థాయులను తక్షణం తగ్గించుకొంటేనే గ్లేసియర్స్, వాటిపై ఆధారపడిన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో తెలిపింది.
ఐరోపా కుతకుత
మంచు కరుగుతున్నది.. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.. వాతావరణ మార్పులతో యావత్తు ప్రపంచం తలకిందులవుతున్నది. అందులోనూ ఐరోపా పరిస్థితిమరీ దారుణం అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అన్ని ఖండాలతో పోల్చితే ఐరోపాలో రెండింతలు ఎక్కువగానే వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తున్నదని తెలిపారు. దాని ప్రభావమే వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు అని ది స్టేట్ ఆఫ్ ది ైక్లెమేట్ ఇన్ యూరప్ వెల్లడించింది.