వాషింగ్టన్, మే 7: గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హొర్ముజ్ జలసంధి ప్రతిష్టంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్-ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు భావిస్తున్న వేళ హొర్ముజ్ జలసంధిలో అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధాన్ని క్రమంగా సడలించనుంది. నౌకల దిగ్బంధం తొలగింపుపై గురువారం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో దిగ్బంధాన్ని క్రమంగా తొలగించి హొర్ముజ్లో రాకపోకలు యథావిధిగా జరిగేందుకు సహకరిస్తామని అమెరికా ప్రకటించిందని అల్ అరేబియా మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో కొన్ని నెలలుగా హొర్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన వందలాది వాణిజ్య నౌకలు కొన్ని గంటల్లో మెల్లిగా తమ పయనాన్ని ప్రారంభిస్తాయని ఆ సంస్థ తెలిపింది.
ఫిబ్రవరి 28న ఇరాన్తో యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హొర్ముజ్ జలసంధి దిగ్బంధం ప్రభావం ప్రపంచం లోని పలు దేశాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా చమురు, గ్యాస్, హీలియం, ఎరువులు వంటి ప్రధాన ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోవడంతో ఆయా దేశాల్లో ఇప్పటికే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచేశారు. రేపో మాపో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో హొర్ముజ్ తెరుచుకుంటే మెల్లిగా క్రూడాయిల్ ధరలు కూడా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో 228కి పైగా కట్టడాలు, పరికరాలు ధ్వంసం అయ్యాయని, ఇది అమెరికా అధికారికంగా ప్రకటించిన నష్టం కన్నా చాలా ఎక్కువని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఉపగ్రహాలు తీసిన చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలు వెల్లడైనట్టు ఆ పరిశోధనా కథనం పేర్కొంది.