North Korea : అమెరికా లక్ష్యంగానే ఉత్తర కొరియా తన ఆయుధాల్ని రూపొందిస్తుందనే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అధునాతన ఆయుధాల్ని ఉత్తర కొరియా సమకూర్చుకుంటోంది. తాజాగా, అధిక సామర్ధ్యం కలిగిన క్షిపణుల ఫ్యుయెల్ ఇంజిన్ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరీక్షించాడు. దేశ సైనిక వ్యూహాత్మక శక్తి, సామర్ధ్యాల్ని పెంచే లక్ష్యంతో ఈ క్షిపణుల ఇంజిన్ను ఉత్తర కొరియా తయారు చేసింది.
ఆయుధ సామర్ధ్యాన్ని విస్తరించడం, మిస్సైల్స్ శక్తిని పెంచడంలో భాగంగా ఇప్పుడు కొత్త క్షిపణుల్ని ఉత్తర కొరియా తయారు చేసినట్లు అక్కడి అధికార మీడియా సంస్థ అయిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ప్రకటించింది. దీని ప్రకారం తాజాగా పరీక్షించిన క్షిపణికి అమెరికాను చేరుకోగల సామర్ధ్యం ఉంది. ఇది నేరుగా అమెరికా భూభాగంపై దాడి చేయగలదు. తాజాగా ప్రయోగించిన క్షిపణి కార్బన్ ఫైబర్ మెటీరియల్తో తయారైంది. దీని ఇంజిన్ 2,500 కిలో టన్స్ పవర్ కలిగి ఉంది. గత సెప్టెంబర్లో ప్రయోగించిన క్షిపణి ఒకటి 1,971 కిలో టన్స్ సామర్ధ్యం కలిగి ఉంది. ఒకే మిస్సైల్ అనేక వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ముఖ్యంగా ఈ క్షిపణి అమెరికాను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించవచ్చు.
ఐదేళ్ల సైనిక అభివృద్ధి లక్ష్యంలో భాగంగా ఈ క్షిపణుల్ని ఉత్తర కొరియా తయారు చేస్తోంది. ఇటీవల అక్కడి పార్లమెంట్లో కిమ్ ప్రసంగించాడు. తమ దేశం అణుసామర్ధ్యం కలిగి ఉందని తెలిపారు. అమెరికా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని, ఘర్షణల్ని ప్రోత్సహిస్తోందన్నారు. తాజా మిస్సైల్ పరీక్ష దేశ సైనిక శక్తిని ఉన్నతంగా నిలపగలదని కిమ్ అన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణుల్ని కూడా ప్రయోగించింది.