న్యూఢిల్లీ: అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్ని 2025 సంవత్సరానికి నోబెల్ బహుమతి విజేతలుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. మోకిర్ అమెరికా-ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా అఘియాన్ ఫ్రాన్స్, హోవిట్ కెనడాకు చెందిన ఆర్థికవేత్తలు. సాంకేతిక ప్రగతి ద్వారా సుస్థిర ప్రగతికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్ ఈ బహుమతికి ఎంపిక కాగా క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర ప్రగతి సిద్ధాంతానికి మిగిలిన ఇద్దరూ ఎంపికయ్యారు.
నార్త్వెస్టర్న్ యూనివర్సిటీలో డచ్-ఇజ్రాయెలీ-అమెరికన్ ఆర్థిక చరిత్రకారుడిగా పనిచేస్తున్న మోకిర్ ప్రతిష్టంభన నుంచి స్వీయ సుస్థిర ఆర్థిక వృద్ధి వైపు సమాజాలు ఎలా పయనించాయో చారిత్రక ఆధారాలను తన పరిశోధనలో ఉపయోగించారు. కొత్త పాత సాంకేతిక, వస్తువుల స్థానాన్ని నూతన ఆవిష్కరణలు భర్తీ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఎలా సాధించగలమో నిరూపించే క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతాన్ని రూపొందించినందుకు ఫిలిప్ అఘియాన్, పీటర్ లను నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.