ఆంక్షలను కొనసాగించని అమెరికా అధ్యక్షుడు బైడెన్
హెచ్-1బీపై నిషేధానికి స్వస్తి!
ఐటీ కంపెనీలకు సానుకూలంగా బైడెన్ నిర్ణయం
భారతీయ నిపుణులకు ఎంతో మేలు
వాషింగ్టన్, మార్చి 31: ఐటీ కంపెనీలకు ఘన విజయం లభించింది. కరోనా పేరుతో గత ఏడాది జూన్లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని కొనసాగించకూడదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నిషేధం గడువు 31తో ముగియనున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది సిలికాన్ వ్యాలీ దిగ్గజాల నుంచి భారత ఐటీ కంపెనీల వరకు అందర్నీ మెప్పించే నిర్ణయమే. అమెరికాలో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసాలను ఐటీ కంపెనీలు ఉపయోగించుకుంటాయి. అయితే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేవారికి హెచ్-1బీ వీసాలపై గతంలో ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31 వరకు నిషేధం విధించింది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ఐటీ దిగ్గజ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి.
హెచ్-1బీ వీసా కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) తెలిపింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్టు పేర్కొంది. పరిమితి ప్రకారం ఏటా 65 వేలు హెచ్-1బీ వీసాలు జారీ చేస్తున్నారు. వీటితో పాటు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి మరో 20 వేల వీసాలు ఇస్తారు.
వాషింగ్టన్, మార్చి 31: ఆసియన్ అమెరికన్ల మీద జరుగుతున్న దాడులపై మౌనంగా ఉండబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆసియన్లపై నేరాలకు సంబంధించి న్యాయశాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను ఆదుకొనేందుకు 49.5 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల అమెరికాలో ఆసియన్లు లక్ష్యంగా వారు నిర్వహిస్తున్న మసాజ్ పార్లర్లలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అమెరికాలో కరోనా వ్యాప్తికి ఆసియన్లే కారణమనే అపోహతో ఆసియన్లపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై కొవిడ్-19 ఈక్విటీ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ప్రకటించారు. మరోవైపు, న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ సమీపంలో ఆసియన్ అమెరికన్ వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
వాటర్గేట్ కుంభకోణం సూత్రధారి మృతి