హైదరాబాద్ : తెలంగాణలో ఇంధన కొరత ( Fuel Shortage ) ఉందని తప్పుడు వార్తలు నమ్మొద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ( Petroleum Dealers Association ) స్పష్టం చేశారు. అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం హెచ్పీసీఎల్ ( HPCL) , ఐవోసీఎల్ ( IOCL ), బీపీసీఎల్ ( BPCL) వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు.
సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని, భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని వివరించారు. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు. కానీ అది కొరత కాదని, పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పీఈఎస్వో ( PESO ) నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
ఇటువంటి చర్యలు చాలా ప్రమాదకరమని, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.