Srinu Vaitla | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ, యాక్షన్ స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తాజాగా భూ వివాదంలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. భూముల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి కొందరు వ్యక్తులు కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, 2019లో ఈ వ్యవహారం ప్రారంభమైంది. శ్రీను వైట్ల తన మేనకోడలు శ్వేతతో కలిసి భూములు కొనుగోలు చేయాలని భావించారు. ఈ క్రమంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తులు వికారాబాద్ జిల్లా కడ్మూర్ ప్రాంతంలో తమకు భూములు ఉన్నాయని నమ్మబలికారు.
నకిలీ పత్రాలు చూపించి, అవి అసలైనవేనని నమ్మింపజేసి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని సేల్ డీడ్లు కూడా రిజిస్టర్ చేశారు. అయితే ఇటీవల ఆ భూములు అసలు వారికి చెందినవి కావని, వేరే వ్యక్తుల ఆస్తులని తేలడంతో మోసం బయటపడింది. మొత్తం రూ.7.2 కోట్ల మేర తనను మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేయగా, ప్రధాన నిందితులు జి. ప్రభాకర్ రెడ్డి, మంచంపల్లి ఆనందం సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ఇలాంటి మోసాలకు మరెవరైనా బలయ్యారా అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక శ్రీను వైట్ల కెరీర్ విషయానికి వస్తే, ‘నీ కోసం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘దుబాయ్ శీను’, ‘రెడీ’, దూకుడు వంటి హిట్స్తో టాప్ డైరెక్టర్గా ఎదిగారు. అయితే తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరచడంతో కెరీర్లో కాస్త వెనుకబడ్డారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భూ వివాదం నుండి త్వరగా బయటపడి మళ్లీ విజయవంతమైన రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.