వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ, యుద్ధోన్మాద చర్యలను నిరసిస్తూ శనివారం దేశమంతా ‘నో కింగ్స్’ నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని 50 రాష్ర్టాలతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు జరిపారు. మిన్నెసోటా రాజధాని సెయింట్పాల్ కేంద్రంగా జరిగిన ఈ ఆందోళనల్లో నిరసనకారులు ట్రంప్నకు వ్యతిరేకంగా కదం తొక్కారు. సెయింట్ పాల్లో జరిగిన భారీ ర్యాలీలో లక్ష మంది పాల్గొన్నారు. మాకు రాజులు వద్దు.. ప్రజా పాలన కావాలని నినాదాలు చేస్తూ ‘నో కింగ్స్’ నిరసన ప్రదర్శనలు జరిపారు. వాషింగ్టన్, లాస్ఏంజెలెస్, డాలస్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌరహక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని నిరసనకారులు వ్యతిరేకించారు. లాస్ ఏంజెలెస్లో ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దేశంలోనే అతిపెద్ద ఆందోళన
ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గతంలో కూడా అమెరికాలో రెండుసార్లు ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో జరిగిన అతి పెద్ద ఆందోళనగా తాజా నిరసనలను పేర్కొంటున్నారు.
కిరీటాన్ని దించు విదూషకుడా
వలసదారుల పట్ల ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరిపై మిన్నెసోటలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సుమారు లక్ష మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వాషింగ్టన్లో వందలాది మంది లింకన్ మెమోరియల్, నేషనల్ మాల్ వైపు ప్రదర్శనలు నిర్వహించారు. ‘కిరీటాన్ని దించు విదూషకుడా’, ‘ప్రభుత్వ మార్పు ఇంటి నుంచే ప్రారంభమవుతుంది’ అంటూ ప్రదర్శకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు గంటలు మోగిస్తూ, డ్రమ్స్ వాయిస్తూ ‘నో కింగ్స్’ నినాదాలు చేస్తూ సాగారు. కాగా, శాన్డియోగోలో 40 వేల మంది ప్రదర్శనలో పాల్గొన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ట్రంప్, అతని యంత్రాంగం ప్రదర్శనలు చేయడానికి ప్రజలు భయపడాలని కోరుకుంటున్నారని, అయితే వారి ఆలోచన తప్పని ఈ ప్రదర్శనలు రుజువు చేస్తున్నాయని న్యూయార్క్ పౌర హక్కుల సంఘం నేత డొన్నా లైబర్మన్ పేర్కొన్నారు.
ఇదంతా వామపక్ష నిధుల నెట్వర్క్
ఈ నిరసన ప్రదర్శనలపై స్పందించిన వైట్ హౌస్ ప్రతినిధి అభిగేల్ జాక్సన్ మాట్లాడుతూ ఇవన్నీ వామపక్ష నిధుల నెట్వర్క్ల ఫలితమని విమర్శించారు. వీటికి ప్రజల నుంచి నిజమైన మద్దతు చాలా తక్కువని పేర్కొన్నారు. ఈ ర్యాలీలను నేషనల్ రిపబ్లిక్ కాంగ్రెస్ కమిటీ కూడా తీవ్రంగా విమర్శించింది. ఇవి అమెరికా ద్వేషపూరిత ర్యాలీలని పేర్కొంది.