Saudi Arabia : సౌదీ అరేబియా (Saudi Arabia) లోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు (Indian) చనిపోయాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. ప్రొజెక్టైల్ దాడిలో భారత్కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
అల్ఖర్జ్లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ పడిపోవడంతో భారత్, బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని సౌదీకి చెందిన సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల వివరాలపై ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశీయులేనని తెలిపింది. ఈ ఘటనలో మరో 12 మంది గాయపడగా.. వారిలో ఓ భారతీయుడు ఉన్నారని పేర్కొన్నది.
దీనిపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఆదివారం సాయంత్రం అల్ఖర్జ్లో జరిగిన దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని తెలిపింది. ఇది ఊరటనిచ్చే వార్త అని పేర్కొన్నది. ఈ వ్యవహారంలో స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు చేస్తున్నామని వెల్లడించింది. గాయపడిన వ్యక్తి అల్ఖర్జ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది.