వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెండ్లికి కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో తన పెండ్లిని రద్దు చేసుకుంటున్నట్లు పీఎం జసిండా ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్తో చాలాకాలంగా కలిసిఉంటున్న ఆర్డెర్న్.. తమ వివాహ తేదీని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొద్ది రోజుల్లోనే వారు వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తున్నది.
దేశంలో మహమ్మారి వల్ల ఇలాంటి అనుభవంపొందిన వారిలో తానుకూడా చేరానని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు. కరోనా నిబంధనల వల్ల ఇబ్బందిపడుతున్న వారు తనను క్షమించాలని ఆమె ప్రజలను కోరారు. ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నదని, అయితే దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉందన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణ వ్యవస్థల్లో, షాపింగ్ మాల్స్లో మాస్కులు తప్పనిసరి చేశారు. అదేవిధంగా వివిహాది వేడుకలకు వంద మందికి మాత్రమే అనుమతించారు. ఈ ఆంక్షలు వచ్చే నెలాఖరు వరకు అమల్లో ఉండనున్నాయి.