Cyber Kidnapping | వాషింగ్టన్, జనవరి 3: నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత కొత్తపుంతలు తొక్కుతున్నదో అదేవిధంగా సైబర్ నేరగాళ్లు అదే సాంకేతికతను ఉపయోగించుకొని మోడర్న్ ైస్టెల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి వరకు ఆన్లైన్ మోసాలు, మాల్వేర్లు చొప్పించడం వంటివి జరుగుతుండగా.. తాజాగా సైబర్ నేరాల అడ్డాలో ‘సైబర్ కిడ్నాపింగ్’ అనే ట్రెండ్ నడుస్తున్నది. అమెరికాతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సైబర్ కిడ్నాపింగ్ ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల అమెరికాలో జువాంగ్ అనే 17 ఏండ్ల చైనా విద్యార్థి ఫిజికల్గా కాకుండా సైబర్ కిడ్నాప్నకు గురయ్యాడు. అనంతరం అతని కుటుంబం నుంచి నిందితులు డబ్బులు వసూలు చేశారు. బాధిత విద్యార్థిని పోలీసులు చిన్న అటవీ ప్రాంతం నుంచి కాపాడారు.
సైబర్ కిడ్నాపింగ్ అంటే?
ఇతర ఆన్లైన్ మోసాల మాదిరిగానే సైబర్ కిడ్నాపింగ్ ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిజిటల్ నేరంగా మారుతున్నది. సైబర్ కిడ్నాపింగ్లో ఆన్లైన్ నేరగాళ్లు బాధితులను లక్ష్యంగా చేసుకొంటారు. పలువిధాలుగా బెదిరింపులకు పాల్పడటం ద్వారా అటవీ లేదా నిర్జన ప్రాంతాలకు వెళ్లమని లేదా తమను తాము నిర్బంధంలో ఉండే విధంగా ఆదేశిస్తారు. బాధితులను వీడియో చాట్ ద్వారా పర్యవేక్షిస్తూ, వారు తీసిన ఫొటోలను బాధిత కుటుంబసభ్యులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తారు. బాధితుడి గొంతును మిమిక్రీ చేసేందుకు కేటుగాళ్లు కృత్రిమ మేథ టూల్స్ను కూడా ఉపయోగిస్తున్నారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
కిడ్నాపర్లు ఎవరైనా సంప్రదిస్తే వెంటనే కమ్యూనికేషన్ కట్ చేసి, పోలీసులకు సమాచారం అందించాలని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. అదేవిధంగా నేరగాళ్లకు డబ్బులు పంపొద్దని, పూర్తి అవగాహనతో ఇలాంటి నేరాలను అరికట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో సున్నిత సమాచారం తస్కరణకు గురికాకుండా సెక్యూరిటీ యాప్లు వినియోగించాలని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ను రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలని, డివైజ్లకు మాల్వేర్ రక్షణ జోడించాలని, అనుమానిత పాపప్ లింకులను క్లిక్ చేయకూడవని, అదేవిధంగా హ్యాకర్లకు దొరక్కుండా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.