జెరూసలేం : కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లు ఆగటం లేదు. గాజాస్ట్రిప్లో మరింత భూభాగాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు తన సైన్యాన్ని (ఐడీఎఫ్)ను ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం ప్రకటించారు. గాజాలో 70 శాతం భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని ఆయన తాజాగా ప్రకటించారు. నెతన్యాహు వ్యాఖ్యలు పాలస్తీనా సంక్షోభాన్ని మరింత పెంచాయి.
గాజాలో పౌర పరిస్థితులు మరింత దిగజారుతాయని సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాలో నిరంతర సైనిక చర్యలు మానవతా పరిస్థితుల్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నాయి. నెతన్యాహు వెస్ట్బ్యాంక్లో మాట్లాడుతూ, ‘గాజాస్ట్రిప్లో 60 శాతం భూభాగం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది. దీనిని 70 శాతానికి విస్తరించడమే మా ధ్యేయం’ అని అన్నారు.