కాఠ్మాండూ: ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల నెల జీతాన్ని రెండు భాగాలుగా చేసి 15 రోజులకు ఒకసారి అందిస్తారు. దీనివల్ల సమయానికి ఉద్యోగుల చేతుల్లో డబ్బు ఉంటుందని.. ఇది వారిని ఆర్థిక వ్యవస్థలో డబ్బును ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఇలా ప్రజల చేతుల్లో తరచూ డబ్బును ఉంచడం ద్వారా వినియోగ డిమాండ్ నెల ప్రారంభంలోనే గరిష్ఠ స్థాయికి చేరి తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టకుండా నెల పొడవునా స్థిరంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇది మధ్య తరగతికి చెందిన ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులూ లాభపడతారని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.