NASA | అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్ (ISS)తో ఆదివారం విజయవంతంగా అనుసంధానమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ (Butch Wilmore) భూమ్మీదకు వచ్చే సమయాన్ని నాసా తాజాగా ప్రకటించింది. ఈనెల 18 అంటే మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వారు భూమ్మీద ల్యాండ్ కానున్నట్లు తెలిపింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకురానున్నట్లు నాసా ప్రకటించింది.
సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్కు చెందిన స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024, జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్.. ఐఎస్ఎస్ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఇందులో భాగంగా ఫాల్కన్-9 రాకెట్ను మూడురోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ.. గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో రద్దు చేశారు. ఇక శనివారం రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నిగింలోకి దూసుకెళ్లింది.
భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగంద్వారా నలుగురు వ్యోమగాములు మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు.
Also Read..
Sunita Williams | జీరో గ్రావిటీ ఎఫెక్ట్.. భూమిపైకి తిరిగొచ్చాక నడవడమూ కష్టమే!
ISS | ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన క్రూ-10 మిషన్.. భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్
Greenland | వీ ఆర్ నాట్ ఫర్ సేల్.. టంప్పై గ్రీన్లాండ్ ప్రజల కన్నెర్ర