ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై పలురకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయీ దేశాలు. ముఖ్యంగా అమెరికా, దాని యూరప్ మిత్ర దేశాలు రష్యాను టార్గెట్ చేస్తున్నాయి.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఒక ఆస్ట్రోనాట్.. రష్యాకు చెందిన ఎయిర్క్రాఫ్ట్లో భూమికి తిరిగి రావడానికి రెడీ అయినట్లు సమాచారం. అమెరికాకు చెందిన మార్క్ వాండే హే అనే వ్యోమగామి రికార్డు స్థాయిలో 340 రోజులు అంతరిక్షంలో గడిపి, భూమికి తిరిగి వస్తున్నాడు. అతన్ని రష్యాకు చెందిన సోయుజ్ ఎయిర్క్రాఫ్ట్లో తీసుకొస్తున్నారు.
దీనిపై నాసాకు చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ప్రోగ్రామ్ మేనేజర్ జోయెల్ మోంటాల్బానో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ పరిస్థితుల గురించి అందరికీ తెలుసునని చెప్పారు. అయినా కూడా తాము రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ (రాస్కాస్మోస్) ప్రతినిదులతో ఎప్పటికప్పుడు చర్చలు సాగిస్తూనే ఉన్నామన్నారు. మార్చి 30న కజకస్థాన్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది.
దీనిలో మార్క్తోపాటు రష్యాకు చెందిన ఓలెగ్ నోవిస్కీ, ప్యోటిర్ డుబ్రోవ్ కూడా భూమిని చేరుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత అంతకు ముందు అనుకున్నట్లే అమెరికా ఆస్ట్రోనాట్ ఇంటికి చేరుకుంటాడట. కాగా, రష్యాపై ఆంక్షల సమయంలో.. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఏదో ఒక దేశంపై కూలిపోతుందంటూ రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ జరగబోదని రాస్కాస్మోస్ అధికారులు చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.