Turkey Earthquake | తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియేలో 40,402 మంది మృతిచెందగా, సిరియాలో 5800 మంది చనిపోయారు. అయితే భూకంపం సంబవించి 12 రోజులు గడుస్తుండటంతో తుర్కియేలో సహాయక చర్యలను నేడు ముగించే అవకాశం ఉన్నది.
ప్రమాదం జరిగి 296 గంటలు పూర్తవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (AFAD) హెడ్ యూనస్ సెజర్ తెలిపారు. దీంతో సహాయ చర్యలను చాలావరకు ఆదివారం రాత్రి ముగించనున్నట్లు వెల్లడించారు. భూకంపం వల్ల 11 ప్రావిన్సుల్లో నష్టం కలగా.. దాంట్లో ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందన్నారు.
భూకంపం ధాటికి రెండు దేశ భూభాగాల్లో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. తుర్కియేలో 84,726 భవనాలు ధ్వంసమైనట్లు ఆ దేశ పర్యావరణ, పట్టణ ప్రణాళిక మంత్రి మూరత్ కురుమ్ తెలిపారు. దేశంలోని 10 ప్రావిన్సుల్లో ఈ నష్టం జరిగినట్లు చెప్పారు. వీటిల్లో కొన్ని పూర్తిగా కూలిపోయాయి. మరికొన్ని భారీగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, మార్చిలో కొత్త భవనాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు అధ్యక్షుడు ఎర్డగోన్ తెలిపారు. ఏడాదిలోగా వాటిని పూర్తి చేస్తామన్నారు.