Nepal | కాఠ్మాండూ: నేపాల్లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం ఉన్న హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు. ‘గణతంత్ర విధానం నశించాలి’, ‘రాచరికం మళ్లీ రావాలి’, ‘నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్పీపీ చైర్మన్ రాజేంద్ర లింగ్డెన్, సీనియర్ నేతలు పశుపతి షంషేర్ రాణా, మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ధ్రుబ బహదూర్ ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఈ నేపథ్యంలో కాఠ్మాండూలోని కీలక ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అనుమతిలేని ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్పీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రతినిధుల సభలో ఆర్పీపీ ఐదో అతి పెద్ద పార్టీ. పోలీసులు అరెస్ట్ చేసిన తమ నేతలను వెంటనే విడుదల చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేసింది. తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.