Ukraine | ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి విపత్తు సంభవించినా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతారు. ఆయా దేశాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. తమ పిల్లలు ఎలా ఉన్నారు? ఏమై పోయారో? అని ఆందోళన చెందుతుంటారు. అలాగే ఆయా దేశాల్లో ఉన్న మన విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తారు.
ప్రపంచంలో 190కి పైగా దేశాలు ఉండగా దాదాపు 90 దేశాల్లో సుమారు 12 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 2.12 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం 50 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఎంబీబీఎస్తో పాటు ఇతర కోర్సులను చదివేందుకు వెళ్తున్నారు. అయితే ఉక్రెయిన్లోనూ వేలాది మంది తెలుగు విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. రష్యా, ఫిలిఫీన్స్, నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్తాన్లోనూ వైద్య విద్యను అభ్యసించేందుకు మన విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే మన దేశంతో పోల్చితే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు ఫీజు అతి తక్కువగా ఉండటం.
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 15.44 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్కు అటెండ్ కాగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ ఇండియాలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. నీట్లో అర్హత సాధించినప్పటికీ మెడికల్ సీట్లు పొందలేకపోతున్నారు. పోనీ ప్రయివేటు కాలేజీలో మెడిసిన్ చేద్దామంటే ఫీజులు అధికంగా ఉండటం. డోనేషన్లు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే కోర్సు పూర్తయ్యేవరకు రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
అయితే ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీరి భద్రత గురించి ఇటు ప్రభుత్వాలు, అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరగడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భయంతో బంకర్లలో తలదాచుకుంటున్నారు.
మరి ఉక్రెయిన్లోనే ఎంబీబీఎస్ చదివేందుకు తెలుగు విద్యార్థులు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే.. అక్కడ ఫీజులు అతి తక్కువగా ఉండటం. మొత్తం మెడిసిన్ కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అంతే కాదు.. ఉక్రెయిన్లో ఉన్నత ప్రమాణాలు కలిగిన వైద్య కళాశాలలు ఉండటం కూడా ప్రధాన కారణం. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా బోధించడం. కొన్ని దేశాల్లో అయితే కేవలం వారి స్థానిక భాషలోనే బోధిస్తున్నారు. ఉక్రెయిన్లో ఇంగ్లీష్ భాషలో బోధించడం ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న వాతావరణ పరిస్థితుల మాదిరే ఉక్రెయిన్లో ఉండే వెదర్ కండిషన్స్ కూడా కలిసొచ్చే అంశం. అయితే అక్కడి మెడికల్ కాలేజీల్లో డోనేషన్ల పేరిట ఫీజులు వసూలు చేయకపోవడం కూడా ఒక కారణం. అతి తక్కువ బడ్జెట్తో వసతి సౌకర్యాలు కల్పించడం. ఎంబీబీఎస్ కోర్సులో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు నిర్వహిస్తూ, పూర్తిస్థాయిలో వైద్య విద్యపై అవగాహన కల్పించడం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ), నేషనల్ ఎగ్జిట్ టెస్టుకు కూడా ఉక్రెయిన్ మెడికల్ కాలేజీలు శిక్షణను ఇస్తున్నాయి.