జకర్తా: ఇండోనేషియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. 950 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలంగన్ రిఫైనరీ ఘటనలో పలువురు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. వెస్ట్ జావా ప్రావిన్సులో ఉన్న రిఫైనరీ నుంచి సోమవారం ఉదయం కూడా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్ముకున్నది. తీవ్రంగా గాయపడ్డ అయిదుగురితో పాటు స్వల్పంగా గాయపడ్డ 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది. జకర్తా ప్రాంతానికి మొత్తం బలంగన్ రిఫైనరీ నుంచే ఇంధనం సరఫరా జరుగుతుంది. 1994 నుంచి ఆ రిఫైనరీ పనిచేస్తున్నది.