లండన్ : పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు చర్యలు తీసకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వయో పరిమితిని తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ కీలక ప్రతిపాదన చేసింది. పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని, వయసు పరిమితిని తీసుకువస్తున్నట్టు తెలిపింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా డేర్ లెయెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పిల్లలను నిజమైన ప్రపంచంలో పెరిగేలా ప్రోత్సహిస్తాం.
ఆన్లైన్ ప్రపంచంలో కాదు. సోషల్ మీడియా ఆటబొమ్మ కాదు. పిల్లలను ఆడుకునేలా, తప్పులు చేసేలా, స్నేహాన్ని పెంచుకునేలా, ప్రవర్తనను నేర్చుకునేలా, వాళ్ల గుర్తింపును పెంచుకునేలా ప్రోత్సహిస్తాం. యూరప్ దేశాల్లో సోషల్ మీడియాను వాడాలంటే వయో పరిమితి ఉండేలా నిబంధన తీసుకొస్తున్నాం’ అని ఆమె చెప్పారు.
ఉర్సులా మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియాను వాడుతున్న పిల్లలు మానసికంగా సరైన స్థితిలో ఉండట్లేదని తెలిపారు. రాబోయే తరాన్ని మానసికంగా సరైన స్థితిలో ఉంచేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియా యాప్స్ను తీసుకొస్తున్న టెక్ కంపెనీలు పిల్లల విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని, అన్ని విధాలుగా సహకరించాలని ఆమె కోరారు. యూరప్ దేశాల్లో ఈ నిబంధన అమలు చేస్తే మిగిలిన దేశాలు కూడా అటువైపు అడుగులు వేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.