మెదక్, మే 17 : ఉన్న ఊరును.. కన్న తల్లిదండ్రులను, కనిపెంచిన పిల్లలను వదిలి బతుకుదెరువు కోసం పట్నం బాటపట్టిన వలసజీవులు నేడు సొంత ఊర్లకు తిరుగు పయనమయ్యారు. ఇన్నాళ్లు హైదరాబాద్, ముంబయి లాంటి నగరాలకు వలసపోయిన బడుగు జీవులు, ఇప్పుడు సొంత గ్రామాల్లోనే బాగా బతుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లాక్డౌన్ను విధించింది. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఊరుబాట పట్టారు. పల్లెల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ప్రస్తుతం యాసంగి వరికోతలు, నూర్పిళ్లు జరుగుతుండడంతో అక్కడ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో వరి పంట పండింది. దీంతో అనేక మందికి బతుకు దెరువు లభిస్తున్నది. జిల్లాలో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు హమాలీ పనిచేసుకుంటూ ఈ కష్టకాలంలో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు..
మెదక్ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వలస వెళ్లిన వారు లాక్డౌన్ కారణంగా తిరిగి గ్రామాలకు వస్తున్నారు. వారికి ఉపాధి హామీ పనులు భరోసా కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వానకాలం సాగు పనులు ఎక్కువగా లేకపోవడంతో కూలీలు ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపుతున్నారు. స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారికి ఈజీఎస్ అధికారులు పనులు కల్పిస్తున్నారు. నెలాఖరుకు సగటున 80వేలకు పైగా కూలీలు పనుల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో తృతీయ స్థానంలో మెదక్ జిల్లా…
ఉపాధిహామీ పథకం కింద 190 రకాల పనులు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. గతేడాది 78.34 లక్షల పనిదినాలకు 57.63 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. 2 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొనగా, వారికి కూలీ కింద రూ.96.46 కోట్లు చెల్లించారు. రోజుకు గరిష్టంగా 1.20 లక్షల మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నట్లు తేల్చారు. ప్రతి కుటుంబానికి వంద రోజులు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 78.94 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటికే ఏప్రిల్ నాటికి లక్ష్యానికి మించి పూర్తిచేశారు. మే నెల లో 62.14 శాతం పని దినాలు పూర్తయ్యాయి.
ప్రతిరోజు 50వేల మందికి పని..
మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు 50వేలకు పైగా కూలీలు పనుల్లోకి వెళ్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వలస వెళ్లిన కుటుంబాలు సైతం గ్రామాల్లోకి వచ్చి ఉపాధిహామీ పనులు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు వేసవి ఎండలు మండిపోతుండడంతో పల్లెల్లో ఉపాధి హామీ పనులను ఉదయం 6 నుంచి 10 గం టల వరకు మాత్రమే చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పూడికతీత, నీటినిల్వ కందకాలు, అటవీ ప్రాంతంలో గుంతలు తీయడం, పొలా ల్లో గట్ల పనులు, హరితహారంలో భాగంగా నర్సరీలను పెంచడం, పంట పొలాలకు దారు లు వేయడం తదితర పనులు చేపడుతున్నారు.
లాక్డౌన్తో సొంతూరికి వచ్చా..
లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి వచ్చి ఉపాధి పనులు చేస్తున్నా. హైదరాబాద్లోని కూకట్పల్లిలోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉండేవాడిని. అక్కడ అడ్డాపై వెళ్లి పనులు చేసేవాడిని. ఇప్పుడు లాక్డౌన్ విధించడంతో అక్కడ ఉపాధి దొరక్క పోవడంతో సొంత ఊరైన మెదక్ మండలం తిమ్మానగర్కు వచ్చి పనులు చేసుకుంటున్నా. సొంత ఊర్లో భార్యాపిల్లలతో సుఖంగా జీవిస్తున్నా.
-కంబాల గోపాల్, తిమ్మానగర్, మెదక్ జిల్లా