ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ కుటుంబం.. సడెన్గా సైలెంట్ అయిపోయింది. ఆ ఇంట్లో నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. కాసేపటికి అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు సహా అందరి మృతదేహాలను తీసుకెళ్లారు. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్లో ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసింది.
ఈ ఘటనలో మోయే సున్ (50), మైషీ సున్ (49) దంపతులతోపాటు వాళ్ల పిల్లలు టిమోతీ (9), టీటుస్ (7) కూడా దుర్మరణం పాలయ్యారు. వాళ్లందర్నీ ఎవరో తుపాకీతో కాల్చి చంపేసినట్లు గాయాలు చూస్తేనే తెలిసిపోతోంది. ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారా? అని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మోయేతో ఆఫీసులో గొడవలు ఉన్న ఫాంగ్ లూను విచారించారు. అయితే తమ మధ్య గొడవలు ఉండటం నిజమేనని, కానీ తను ఈ ఘాతుకానికి ఒడిగట్టలేదని ఫాంగ్ చెప్పాడు.
డీఎన్ఏ ఫలితాలు వచ్చేలోగా స్వదేశమైన చైనా వెళ్లిపోయాడు. ఆ ఫలితాల్లో ఈ హత్యలు చేసింది ఫాంగ్ అని స్పష్టమైంది. కానీ అతన్ని పట్టుకోలేని పరిస్థితి. ఇలా 8 ఏళ్లు గడిచిన తర్వాత.. ఈ నెల 11న కాలిఫోర్నియా విమానాశ్రయంలో దిగిన వెంటనే ఫాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో ఈ హత్యల వెనక ఉన్న కారణాన్ని ఫాంగ్ వెల్లడించాడు. కంపెనీలో ఆర్ అండ్ డీ విభాగానికి వెళ్లేందుకు సాయం చేయాలని మోయేను తను కోరినట్లు ఫాంగ్ తెలిపాడు.
కానీ మోయే తనకు సహాయం చెయ్యలేదని, తనకు ప్రమోషన్ రాలేదని చెప్పాడు. దానికితోడు సహోద్యోగులంతా తనను అవాయిడ్ చేయడం మొదలు పెట్టారని, ఆ కోపంలోనే మోయే కుటుంబం మొత్తాన్ని హతమార్చానని పేర్కొన్నాడు. ఈ హత్యాకాండ వెనుక ఉన్న కారణం విని పోలీసులు షాకయ్యారు. ఫాంగ్ భార్య కూడా తన భర్త ఇంత ఘోరానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నానని ఏడ్చేసింది. అసలు అతను గన్ కొన్న విషయమే ఆమెకు తెలియదని చెప్పింది.