పారిస్, అక్టోబర్ 12: యూరప్లోనే అతిపెద్ద నగరాలైన లండన్, పారిస్ను నల్లులు హడలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో నల్లులు వ్యాప్తి చెందటంతో పారిస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నల్లుల బాధ తట్టుకోలేక పారిస్, మార్సెల్లీలలో జనాలు పాత పరుపుల్ని ఆరు బయట ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు.
సినిమా థియేటర్లు, హోటల్స్, దవాఖానాలు, రైళ్లు.. ఇలా అన్నిచోట్లా నల్లులు విస్తరించాయి. బ్రిటన్ వ్యాప్తంగా ఇండ్లల్లో నల్లులు కుట్టడం 65శాతం పెరిగిందని పెస్ట్ కంట్రోల్ కంపెనీ ‘రెంటోకిల్’ వెల్లడించింది. క్రిమిసంహాకారాల్ని వెదజల్లి వీటిని చంపేందుకు హోటల్స్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. పరుపుల్లో ఉండే ఈ నల్లులు రాత్రిపూట మనిషి శరీరం నుండి రక్తాన్ని పీల్చుతాయి. ఇవి అంత ప్రమాదకరం కాకపోయినా, వీటి వల్ల మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటివి ఉంటాయి. దురద, అలర్జీ, చర్మ సంబంధ సమస్యలు రావొచ్చు.