స్వామివారికి 108 కొబ్బరికాయల సమర్పణ
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీవారి ఖజానాకు రూ. 2,69,721 ఆదాయం
యాదాద్రి, ఏప్రిల్ 23: కరోనా వైరస్ నశించిపోవాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆలయ అధికారులు, అర్చకులు పూజలు చేశారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రాగమశాస్త్ర ప్రకా రం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన కొనసాగింది. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం కాగా ఈసారి కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించాలని స్వామివారికి ప్రత్యేక అర్చనలతో పాటు సుదర్శన నారసింహహోమం నిర్వహించారు.
స్వామివారికి 108 కొబ్బరికాయల సమర్పణ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సుదర్శన నారసింహహోమం చేపట్టి, స్వామివారికి 108 కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. కరోనా వైరస్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులు త్వరగా కోలుకోవాలని, రాష్ట్ర ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నశించిపోవాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఏఈవోలు దోర్బాల భాస్కర్శర్మ, రమేశ్బాబు, శ్రవణ్కుమార్, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు పాల్గొన్నారు.
శాస్ర్తోక్తంగా లక్ష్మీపూజలు
స్వామివారి దివ్యక్షేత్రంలో లక్ష్మీపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం బాలాలయం లో కవచమూర్తులను సువర్ణపుష్పాలతో అర్చించి, వేదమంత్రాలతో అభిషేకించారు. తులసిదళాలు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారిసన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం సాగింది. స్వామివారిబాలాలయంలో లక్ష్మీనృసింహులను దివ్యమహోహరంగా అలంకరించి తిరు నిత్యకల్యాణోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. మొదటగా సుదర్శన నారసింహహోమం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారికి రోజువారీ నిత్యారాధనలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. వేకువజామూన సుప్రభాతంతో ఆరంభించిన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవ వేడుకలతో ముగిశాయి. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళాలతో అర్పించారు. ఆలయంలో అష్టోత్తరం, సువర్ణపుష్పార్చనలు కొనసాగాయి. బాల శివాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి కొండ కింద గల తులసివనం వద్ద గల శిల్పారామంలో భక్తులు శ్రీ సత్యనారాయణ వ్రతమాచరించి కొండపైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించున్నారు.
ఆదాయం రూ. 2,69,721 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి రూ. 2,69,721 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 29,044, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 3,800, కైంకర్యాల ద్వారా రూ. 10,350, సుప్రభాతం ద్వారా రూ. 500, ప్రచారశాఖ ద్వారా రూ. 500, క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,280, వ్రతాల ద్వారా రూ. 8,500, కల్యాణకట్ట ద్వారారూ. 7,400, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 1,11,235, వాహనపూజల ద్వారా రూ. 6,200, టోల్గేట్ ద్వారా రూ. 580, అన్నదాన విరాళం ద్వారా రూ. 15,889, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 15,016, యాదరుషి నిలయం ద్వారా రూ. 16,400, పాతగుట్ట ద్వారా రూ. 5,111, టెంకాయ విక్రయాల ద్వారా రూ. 12,900, ఇతర విభాగాలతో రూ. 25,016 తో కలిపి స్వామివారికి రూ. 2,69,721 ఆదాయం సమకూరింది.