ప్యోంగ్యాంగ్: అణు యుద్ధానికి తాము సిద్ధమే అని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఆయన అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో ఆయన మాట్లాడారు. అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు. అవసరం అయితే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఏడవ సారి అణ్వాయుధాన్ని పరీక్షించనున్నట్లు వార్తల వస్తున్న నేపథ్యంలో కిమ్ ఇచ్చిన వార్నింగ్ కొత్త డౌట్స్కు తెరలేపింది. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. అయితే ఇటీవల కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే అత్యధిక స్థాయిలో మిస్సైళ్లను పరీక్షించింది. ఆ దేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 31 మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. అయితే ఉత్తర కొరియాపై అమెరికా వ్యవహరిస్తున్న దూకుడు విధానాన్ని కిమ్ తప్పు పట్టారు. అగ్రరాజ్యం తీరు మారడంలేదన్నారు. అమెరికా పెత్తందారుల్ని మన ఐడియాలజీ, సైనిక దళాలతో ఢీకొట్టాలన్నారు. అమెరికాతో ఎటువంటి సైనిక చర్యను ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే న్యూక్లియర్ అటాక్కు కూడా రెఢీగా ఉన్నట్లు కిమ్ వార్నింగ్ ఇచ్చారు.