ప్యోంగ్యాంగ్: ఇరాన్పై దాడి చేసిన అమెరికా దూకుడు వైఖరిని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un) తప్పుపట్టారు. సోమవారం పార్లమెంట్లో మాట్లాడుతూ తమ దేశం సమకూర్చుకుంటున్న అణ్వాయుధాలను ఆయన సమర్ధించుకున్నారు. కిమ్ ప్రసంగానికి చెందిన అంశాలను మంగళవారం ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కిమ్ చెప్పారు. సైన్యం, భద్రత అంశంలోనూ తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు.
ఇరాన్లో కొనసాగుతున్న అమెరికా దాడుల గురించి ప్రస్తావిస్తూ.. సార్వభౌమ దేశాల హక్కులను అగ్రరాజ్యం కాలరాస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంత సుస్థిరత, శాంతి కోసం అణ్వాయుధాల సమీకరణ అవసరం అని అన్నారు. కిమ్ తన ప్రసంగంలో నేరుగా ట్రంప్ పేరును ప్రస్తావించలేదు. కానీ, అమెరికా ప్రభుత్వం ఉగ్ర దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా వ్యవహరిస్తోందన్నారు. ఇరాన్తో ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. సమరమైనా, సంధి అయినా, ఆ నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందన్నారు.