వాషింగ్టన్, జూలై 4: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖలిస్థాన్ మద్దతుదారులు మళ్లీ రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున భారత దౌత్యకార్యాలయానికి నిప్పు పెట్టారు. వేలాది మంది అక్కడికి చేరుకొని ఆయుధాలను ప్రదర్శిస్తూ రణరంగం సృష్టించారు. శాన్ఫ్రాన్సిస్కో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు స్టేట్, ఫెడరల్ అధికారులు తెలిపారు.
దౌత్యకార్యాలయంలోని పలు గదులు మంటల్లో చిక్కుకున్నాయని, స్వల్పంగా నష్టం వాటిల్లిందని, ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు. కెనడాలో జూలై 2న కేటీఎఫ్ (ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో, ఖలిస్థాన్ మద్దతుదారులు ఓ వీడియోను విడుదల చేశారు. హింసను హింసతోనే ఎదుర్కొంటామని అందులో హెచ్చరించారు. ఈనేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది. జూలై 8న ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీ చేపడుతున్నామని దాని మద్దతుదారులు ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తీవ్రంగా ఖండించిన అమెరికా
దౌత్యవేత్తలు, వారి కార్యాలయాలపై దాడులు తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తాజా దాడిని భారత కమ్యూనిటీ నాయకుడు అజయ్ భుటోరియా ఖండించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఐఎస్ఐ నుంచి ఆయుధాలు
పాక్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా అవుతున్నట్టు తెలిసింది. పంజాబ్ ఫిరోజ్పూర్కు చెందిన ఓ ఖలిస్థాన్ ఉగ్రవాది కొద్ది రోజుల క్రితం పోర్చుగల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడ్ని పంజాబ్లోని క్రిమినల్స్కు ఆయుధాల్ని చేరవేయటానికి ఐఎస్ఐ ఏర్పాటుచేసుకుందని, పోర్చుగల్లో ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఐఎస్ఐ సాయం చేస్తున్నదని వార్తలు వచ్చాయి.