జెరూసలేం: ఇజ్రాయెల్లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ముగ్గురు కేరళకు చెందినవారే. మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై సోమవారం ఈ దాడి జరిగింది. మృతుడిని కేరళలోని కొల్లాంకు చెందిన 30 ఏళ్ల పట్నిబిన్ మ్యాక్స్వెల్గా గుర్తించారు.
గాయపడిన బుష్ జోసెఫ్ జార్జ్ (31), పాల్ మెల్విన్ (28)కు చికిత్స కొనసాగుతున్నది. తాజా దాడితో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తున్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని మంగళవారం సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీచేసింది. కాగా, మృతిచెందిన మ్యాక్స్వెల్ భార్య ప్రస్తుతం గర్భిణి అని, ఇప్పటికే వారికి ఒక కుమారుడు ఉన్నారని అధికారులు తెలిపారు.