మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోనే అతిపెద్ద నగరమైన అల్మాటీతో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు నిరసనలను ఉద్ధృతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. మేయర్ ఆఫీస్ సహా పలు కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపడంతో డజనుకు పైగా మృతిచెందారు. వేలాదిమందికి గాయాలయ్యాయి. నిరసనకారుల దాడుల్లో 12 మంది పోలీసులు మరణించగా, 350 మందికిపైగా తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. దేశంలో పరిస్థితులను అదుపు చేయడానికి శాంతి పరిరక్షణ దళాలను పంపించాల్సిందిగా రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్కు అధ్యక్షుడు కసైమ్ జోమార్ట్ టొకాయెవ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో పరిస్థితులపై రష్యా, చైనాతో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. కజకిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి రావాలనుకొంటే ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.