పలు ప్రాజెక్టుల సందర్శన
బీజింగ్, జూలై 23: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా టిబెట్ను సందర్శించారు. బుధవారం అక్కడి నియంజి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగిన ఆయన.. న్యాంగ్, బ్రహ్మపుత్ర నదులపై చైనా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులను, రైల్వేస్టేషన్, మ్యూజియంను సందర్శించారు. స్థానిక ప్రజలతో ముచ్చటించారు. టిబెట్లో చైనా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యకలాపాలను పర్యవేక్షించారు. అధ్యక్షుడి పర్యటన బుధవారం జరిగినప్పటికీ, ఈ వివరాల్ని అధికారులు బయటపెట్టలేదు. శుక్రవారం స్థానిక మీడియాలో వచ్చిన కథనాలతో పర్యటన విషయం వెలుగులోకి వచ్చింది. 2013లో చైనా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిన్పింగ్ టిబెట్ను పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే 1990 తర్వాత చైనా అధ్యక్షుడు టిబెట్లో పర్యటించడం కూడా ఇదే తొలిసారి. భారత్లోని అరుణాచల్ప్రదేశ్ భూభాగం దక్షిణ టిబెట్కు చెందినదని గత కొంతకాలంగా చైనా వాదిస్తున్నది. దీన్ని భారత్ వ్యతిరేకిస్తున్నది. తూర్పు లఢక్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జిన్పింగ్ పర్యటన చర్చనీయాంశం అవుతున్నది.