Israel-Hamas War | రఫా, వాషింగ్టన్, అక్టోబర్ 26: ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గురువారం ఉత్తర గాజాలోకి అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టాయి. సుమారు 250 స్థావరాలే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కొందరు మిలిటెంట్లను హతమార్చి వారి మౌలిక సదుపాయాలను, యాంటీ-ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ పొజిషన్లను ధ్వంసం చేసినట్టు తెలిపింది. తిరిగి యుద్ధట్యాంకులు వెనక్కి వచ్చేసినట్టు పేర్కొన్నది. మరోవైపు గాజా-లెబనాన్ సరిహద్దులో గురువారం వైమానిక, డ్రోన్ దాడులు చేసినట్టు పేర్కొన్నది. యుద్ధం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మందుల కొరత వల్ల క్షతగాత్రుల ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతున్నదని గాజాలోని ఒక వైద్యుడు తెలిపారు.
ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి ఇండియా-మధ్య ప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ ఒక కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన అభిప్రాయానికి ఆధారాలు లేవని.. ఇజ్రాయెల్ అనుసంధానత, ప్రాంతీయ అనుసంధానం కోసం తాము చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ దాడులు జరిగి ఉండొచ్చన్నారు.