హమాస్పై దాడిని మరింత తీవ్రం చేసిన ఇజ్రాయెల్.. గాజాను గాలి ఆడకుండా చేస్తున్నది. చీలికలాంటి ఆ భూభాగాన్ని అష్టదిగ్బంధనం చేసింది. కరెంటు, నీరు, ఆహారం, ఇంధనం లాంటివేవీ అందకుండా చూస్తున్నది. అటు ఉగ్రవాద సంస్థ హమాస్ ఇటు ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇరువురి మధ్య యుద్ధంలో ఇంతవరకు 1300మందికి పైగా మృతిచెందారు.
Israel-Hamas War | జెరూసలేం, అక్టోబర్ 9: హమాస్ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్ను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ‘గాజాకు కరెంట్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించాను. ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు సరఫరా అయ్యే మార్గాలను మూసివేయాలని నిర్ణయించాం. 500 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టాం. చాలామందిని అదుపులోకి తీసుకున్నాం. హమాస్ నుంచి గాజాకు విముక్తి కల్పించడమే ఇజ్రాయెల్ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
గాజాలోని సుమారు 1000 ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. 159 ఇండ్లు, 1210 ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో ఇప్పటికే గాజాలో లక్ష మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిండి, నీరు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లను ఐడీఎఫ్ దళాలు ఏరివేశాయి. సరిహద్దులను సైన్యం పటిష్ఠం చేసింది. రక్షణ కంచెల వద్ద యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ దళాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. అదనంగా 3 లక్షల మందిని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఇరువైపులా 1300 మందికి పైగా మరణించారు.
మెరుపుదాడి చేస్తూ ఇజ్రాయెల్లో ఊచకోతకు దిగిన హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. రాత్రికి రాత్రే 500 మంది మిలిటెంట్లను హతమార్చింది. కాగా, ఇప్పటికే హమాస్ మిలిటెంట్లు సుమారు 130 మందికిపైగా ఇజ్రాయెల్, ఇతర దేశాల వారిని బందీలుగా చేసుకున్నారు.
హమాస్ చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన 9 మంది పౌరులు మరణించినట్టు ఆ దేశం ప్రకటించింది. 12 మంది థాయిలాండ్ పౌరులు, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, నేపాల్, మెక్సికో, ఉక్రెయిన్లకు చెందిన పౌరులు చనిపోయారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా తమ యుద్ధ నౌకలు, విమానాలను మధ్యదరా సముద్రంలో మోహరించింది.
ఇజ్రాయెల్లో ఉంటున్న ఓ భారతీయురాలు హమాస్ రాకెట్ దాడుల్లో గాయపడ్డారు. కేరళకు చెందిన శీజ ఆనంద్ ఆష్కేలోన్ నగరంలో నర్సుగా పని చేస్తున్నారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులతో వీడియోకాల్ మాట్లాడుతుండగా హమాస్ దాడుల్లో ఆమెకు గాయాలయ్యాయి.
హమాస్ చేసిన మెరుపు దాడి వెనుక ఇరాన్ ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్పై దాడికి సంబంధించి ప్రణాళికలు రచించేందుకు సమావేశాలు జరిగినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ కథనాలు వెలువరించింది. ఇరాన్ ఆర్మీ ఐఆర్జీసీకి చెందిన నలుగురు ఉన్నతాధికారులు, హెజ్బొల్లా గ్రూప్లతో హమాస్ గతవారం సమావేశమైనట్టు.. అప్పుడే దాడికి ఇరాన్ మద్దతు తెలిపినట్టు పేర్కొంది. గతంలో ఆగస్టులో జరిగిన సమావేశాల్లో ఏకంగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా పాల్గొన్నట్టు తెలుస్తున్నది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదరకుండా చేయడమే ఇరాన్ లక్ష్యమని వాల్స్ట్రీట్ జర్నల్ నివేదికలో పేర్కొంది.
ఇజ్రాయెల్ను ముప్పుతిప్పలు పెడుతున్న హమాస్ వెనుక దాని మాస్టర్మైండ్ డెయిఫ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏకకాలంలో 5 వేల రాకెట్లను ప్రయోగించాలనే ప్రణాళిక అతడిదేనట. 1980లో హమాస్లో చేరిన డెయిఫ్ కస్సాం రాకెట్ల తయారీలోనూ భాగమయ్యాడు. గాజా టన్నెళ్ల నిర్మాణం వెనుక కూడా అతడే ఉన్నాడట. డెయిఫ్ను మట్టుబెట్టేందుకు అనేకసార్లు ప్రయత్నించిన ఇజ్రాయెల్ సఫలం కాలేకపోయింది.
హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు ఖతార్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాలకు చెందిన 136 మంది బందీలను విడిపించేందుకు ఖతార్ ఇరుదేశాల మధ్య రాజీకి యత్నిస్తున్నది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా పౌరులను విడిచిపెడితే… బందీలను విడిచిపెట్టేలా ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తున్నది. అయితే 36 మంది కోసం 136 మందిని హమాస్ విడిచిపెడుతుందా? అన్నది సందేహమే.
ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లు దారుణానికి ఒడిగట్టారు. గాజాలో సమీపంలోని కిబుజ్ రెయిమ్లో జరుగుతున్న మ్యూజికల్ పార్టీలో పాల్గొన్న వారిపై హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. అక్కడ జరుగుతున్న నేచర్ పార్టీలో పాల్గొన్న 260 మందిని హతమార్చి మారణహోమాన్ని సృష్టించారు. తాజాగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయెల్ నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా తమపై దూసుకొచ్చే ఒక్కో బాంబుకు ప్రతీకారంగా ఒక్కో ఇజ్రాయెల్ పౌరుడిని ఉరి తీస్తామని హమాస్ హెచ్చరించింది. తమ పౌరుల ఇండ్లపై దాడులకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్కు హమాస్ వార్నింగ్ ఇచ్చింది.